హైదరాబాద్: బీహార్లో సరికొత్త శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీని కోసం ఆ రాష్ట్ర సర్కారు భూమిని కేటాయించింది. పాట్నా సమీపంలో సుమారు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం సామ్రాట్ చౌదరీ తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు .. ఆ రాష్ట్ర సీఎంను కలిసి సన్మానించారు. సనాతన ధర్మ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా బీహార్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్. నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామితో కలిసి బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. భూమి కేటాయింపుపై ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీహార్ సీఎంను టీటీడీ ఛైర్మన్ శాలువాతో సన్మానించి, శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో బీహార్ చీఫ్ సెక్రటరీ శ్రీ అమృత్ ప్రత్యయ్ కూడా పాల్గొన్నారు.
గంగా నది తీరాన
పాట్నాకు సమీపంలో, గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు అత్యంత వైభవంగా కళ్యాణ మండపం, పవిత్రమైన పుష్కరిణిని ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు. ఈ ఆలయ నిర్మాణం ద్వారా ఉత్తర భారతదేశ భక్తులకు కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు మరింత చేరువవుతాయని సీఎం సామ్రాట్ చౌదరి అన్నారు. సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలను టీటీడీ వేగవంతం చేసిందని, ఇప్పటికే అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో ఆలయ నిర్మాణానికి పది ఎకరాల భూమి కేటాయించారని టీటీడీ చైర్మెన్ నాయుడు తెలిపారు.
బీహార్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మితమైతే, అది హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన సంస్కృతి విస్తరణకు ఒక ప్రముఖ కేంద్రంగా మారుతుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు అభిప్రాయపడ్డారు. భక్తులకు ఉన్నతమైన ఆధ్యాత్మిక సేవలు అందించడానికి, స్థానికంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ క్షేత్రం ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.