Bihar gangster : తనను ఎన్కౌంటర్ చేసేందుకు ప్లేసు, టైం చెప్పాలంటూ ఒక గ్యాంగ్స్టర్ పోలీసులకు సవాల్ విసిరాడు. తర్వాత పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ ఘటన బిహార్లోని చంపారణ్ జిల్లా మోతిహరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో కుందన్ ఠాకూర్ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్. అతడు అనేక నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా ఠాకూర్, అతడి గ్యాంగ్ అజ్ఞాతంలో ఉన్నారు.
ఇటీవల ఠాకూర్ పోలీసులకు సవాల్ విసిరాడు. వారిని హెచ్చరిస్తూ ఆడియో సందేశాలు పంపాడు. ముఖ్యంగా చకియా పోలీస్ స్టేషన్ ఆఫీసర్కు నేరుగా హెచ్చరికలు జారీ చేశాడు. తనను పట్టుకునేందుకు ఎంత మంది పోలీసులు వచ్చినా వారి అంతుచూస్తానని, దమ్ముంటే ప్లేస్, టైం చెప్పాలంటూ సవాల్ విసిరాడు. తనను ఎన్కౌంటర్ చేయాలనుకుంటే ఎందరో పోలీసుల ప్రాణాలు పోతాయని హెచ్చరించాడు. ‘‘రాబోయే పెద్ద వార్త ఎన్కౌంటర్కు సంబంధించింది. ఒక క్రిమినల్ను పట్టుకునే ప్రయత్నంలో 10 నుంచి 15 మంది పోలీసులు వారి ప్రాణాలు కోల్పోయారు. ఒక గ్యాంగ్స్టర్ అంటే ఏంటో నేను మీకు నిజంగా చూపిస్తా’’ అంటూ తన ఆడియో సందేశంలో ఠాకూర్ పేర్కొన్నాడు. పోలీసులు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, వాటిని ఆపకుంటే తాను కూడా పోలీసుల కుటుంబాల అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
తాను పారిపోవడం లేదని, ఎన్కౌంటర్లో ఎంతమంది పోలీసుల్నైనా ఎదుర్కొంటానన్నాడు. ఇది హెచ్చరిక కాదని, సలహా మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అయితే, అప్పటికే అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు తగిన సమాచారం అందింది. ఠాకూర్, అతడి అనుచరులు ఉన్న ప్రదేశం గురించి సమాచారం అందుకున్న ప్రత్యేక బృందం ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఠాకూర్ గ్యాంగ్ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. తమ సహచరుడు మరణించినప్పటికీ పోలీసులు ఠాకూర్ అండ్ గ్యాంగ్కు వ్యతిరేకంగా కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో కుందన్ ఠాకూర్తోపాటు మరో ఇద్దరు క్రిమినల్స్ కూడా హతమయ్యారు.
ఈ ఘటన సమయంలో ఈ ప్రాంతమంతా కాల్పుల శబ్దాలతో మోతమోగింది. ఈ ఘటనపై చంపారన్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ స్పందించారు. ఠాకూర్ పోలీసులకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాడని, ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపాడని తెలిపారు. దీంతో ఆత్మరక్షణ చర్యలలో భాగంగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించినట్లు తెలిపారు. ఈ నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి ఓనర్, అతడి తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.