పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish kumar) కంటే అతని కొడుకు ఐదింతల ధనవంతుడు. అవును ప్రభుత్వ గణాంకాలు ఇవే పేర్కొంటున్నాయి. డిసెంబర్ 31న సీఎం సహా మంత్రులు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచారు. దీని ప్రకారం సీఎం నితీశ్ కుమార్ స్థిర, చరాస్తుల విలువ రూ.75.36 లక్షలు మాత్రమే. అయితే అతని కుమారుడు నిశాంత్.. నితీశ్ కన్నా ఐదురెట్లు ధనవంతుడు కావడం గమనార్హం.
నితీశ్ వద్ద రూ. 29,385 నగదు ఉండగా, వివిధ బ్యాంకుల్లో రూ.42,763 డిపాజిట్ చేశారు. కాగా, అతని కుమారుడు నిశాంత్ వద్ద రూ.16,549 నగదు, ఆయన పేరుతో రూ.1.28 కోట్ల విలువైన ఎఫ్డీలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రికి రూ.16.51 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, స్థిరాస్తుల మొత్తం విలువ రూ.58.85 లక్షలు. ఇక నిశాంత్కు రూ.1.63 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1.98 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
ముఖ్యమంత్రికి న్యూఢిల్లీలోని ద్వారకలో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉండగా, ఆయన కుమారుడికి నలందా జిల్లాలోని కళ్యాణ్ బిఘా, హకీకత్పూర్, పట్నాలోని కంకర్బాగ్లో వ్యవసాయ భూమి, ఇండ్లు ఉన్నాయి. అదేవిధంగా కళ్యాణ్ బిఘాలో వ్యవసాయేతర భూమి కూడా ఉండటం విశేషం. కాగా, తనకు రూ.1.45 లక్షల విలువైన 13 ఆవులు, తొమ్మిది దూడలు ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.