పట్నా: అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శ్లాఘించారు. కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నారు. పట్నాలో గల్వాన్ అమర సైనికుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయంగా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిహార్ సీఎం నితీష్ కూడా పాల్గొని చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
అమర వీర సైనికుల కుటుంబాలకు కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలని సీఎం నితీష్ అన్నారు. ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ వంతుగా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడటం గొప్ప విషయమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం చాలా గొప్పదని, ఆ పథకాన్ని ఎలా చేశారో చూసి రావాలని బిహార్ అధికారులను పురమాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు.