Bihar | పాట్నా : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జేడీయూ-బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి..? ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య జేడీయూ వద్ద ఉందా? అనే అంశాలను పరిశీలిద్దాం.
243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా మారింది. ఆర్జేడీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో వైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవలం 45 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. ఈ లెక్కన ఆర్జేడీకి ఇంకా 43 మంది సభ్యులు అవసరం. జేడీయూ-బీజేపీ కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ సరిపోతోంది. దీంతో బీజేపీ-జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకా ఉండదు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్కు మద్దతు తెలుపుతూ లేఖలు ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక వేళ బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీజేపీ సభ్యులు.. ఆర్జేడీ మంత్రుల స్థానంలో ప్రమాణం చేసే అవకాశం ఉంది.
మరో వైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇప్పటికే తాము కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సంకేతలిచ్చారు. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 112 మంది సభ్యుల బలం ఉంది.