న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా బీజేపీ యేతర పార్టీల నేతలతో సమావేశమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేంజ్రీవాల్తో (Arvind Kejriwal) నితీశ్ భేటీ అయ్యారు.
బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav), పార్టీ నేతలు మనోజ్ ఝా, లలన్ సింగ్, సంజయ్ ఝాతో కలిసి న్యూఢిల్లీ చేరుకున్న నితీశ్.. ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే తమతో కలిసి రావాలని కేజ్రీని కోరనున్నారు. కాగా, ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి పోరాడుతామని కేజ్రీవాల్ ప్రకటించిన తెల్లారే సీఎం నితీశ్ ఆయనతో భేటీ కావడం విశేషం.
ఈ నెల 11న రాజకీయ కురు వృద్ధుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో నితీశ్ కుమార్ సమావేశమైన విషయం తెలిసిందే. బీజేపీ పాలనలో దేశం నాశనమవుతోంది. అందువల్ల ఎంత ఎక్కువ సంఖ్యలో విపక్ష పార్టీలు ఏకమైతే, దేశానికి అంత మంచిది. వేరే రాజకీయ పార్టీలను కూడా సంప్రదిస్తున్నాం. సరైన సమయంలో అందరం కూర్చుని భవిష్యత్ కార్యాచారణ నిర్ణయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
అంతకుముందు ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. ప్రత్యేకంగా భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren)తో కూడా సమావేశమయ్యారు.