పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. నితీశ్ కుమార్ తనను ఇంటికి ఆహ్వానించాడని, జేడీయూలో చేరి పార్టీని నడిపించాలని ఆఫర్ చేశాడని ఈ నెల 5న ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఇదే ఇద్దిర మధ్య వివాదానికి కారణమైంది.
ప్రశాంత్ కిషోర్ చేసేవి నిరాధార ఆరోపణలని నితీశ్ కుమార్ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీకేను తాను పార్టీలోకి ఆహ్వానించాననడం అబద్ధమన్నారు. కొన్నేండ్ల క్రితం జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయాలంటూ కిషోర్ తనకు సలహా ఇచ్చాడని నితీశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎజెండా ప్రకారం పనిచేస్తున్నాడని విమర్శించారు.
దీనిపై ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ కుమార్ చెప్పేవన్నీ అసత్యాలన్నారు. తాను జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయమన్నానని చెబుతూనే, బీజేపీ ఎజెండా ప్రకారం పనిచేస్తున్నానని ఆరోపించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. మొదటి నిజమైతే రెండోది తప్పు, రెండోది నిజమైతే మొదటిది తప్పు అవుతుందని వ్యాఖ్యానించారు. వయసు ప్రభావంతో నితీశ్కు మతితప్పిందని ఎద్దేవా చేశారు.