చెన్నై: బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తూ కుటిల రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తమిళనాడులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ గుడ్బై చెప్పారు. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే వాళ్లంతా బీజేపీని వీడి దాని మిత్రపక్షమైన అన్నా డీఎంకేలోనే చేరారు.
మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే తమ పార్టీ నేతలకు ఎర వేస్తున్నదని ఓ వైపు బీజేపీ ఆరోపిస్తుండగానే తాజా పరిణామం చోటుచేసుకున్నది. కాగా, ఇవాళ బీజేపీని వీడిన 13 మంది నేతలు పశ్చిమ చెన్నైలోని ఐటీ విభాగానికి చెందినవారు. తాను బీజేపీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులను ఆశించలేదని, అయితే పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను పార్టీని వీడేలా చేశాయని బీజేపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు అంబరాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, అంబరాజన్తోపాటు ఇవాళ బీజేపీని వీడిన వారిలో 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు. అంతకుమునుపే బీజేపీ ఇంటెలెక్చువల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణన్, ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్, తిరుచ్చి రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, రాష్ట్ర ఓబీసీ వింగ్ కార్యదర్శి అమ్ము అన్నాడీఎంకేలో జాయిన్ అయ్యారు.