Set Back to BJP | రాజస్థాన్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నుంచి సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కటారా బీజేపీకి రాంరాం చెప్పారు. ఆయనతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ కార్యకర్తలతో పాటు వాగడ్ నుంచి డజనుకు పైగా బీజేపీ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈయన రాజస్థాన్ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దేవేంద్ర కటారా 2013 నుంచి 2018 వరకు దుంగార్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనుండటంతో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. శనివారం నాడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కటారా తన మద్దతుదారులతో కలిసి జైపూర్లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. బీజేపీ, కాంగ్రెస్లను ఈ సందర్భంగా కటారా తీవ్రంగా టార్గెట్ చేశారు. వాగడాలో గిరిజనులను బీజేపీ నక్సలైట్లు అంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతపై తప్పుడు కేసులు పెడుతున్నదని ఆరోపించారు. అందుకే ఇవాళ ఈ రెండు రాజకీయ పార్టీలను పాతర పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశంలో అభివృద్ధి రాజకీయాలను అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారని కటారా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ, పంజాబ్ తరహాలో రాజస్థాన్లో కూడా నిజాయితీగా పాలన జరగాలని కోరుకుంటున్నామన్నారు.
ఇది ఆరంభం మాత్రమేనని ఆమ్ ఆద్మీ పార్టీ రాజస్థాన్ రాష్ట్ర ఇంచార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే వినయ్ మిశ్రా చెప్పారు. రాజస్థాన్లో బీజేపీ, కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీల నేతలు మాతో టచ్లో ఉన్నారని తెలిపారు. త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీలోకి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ఢిల్లీలో అదానీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రాజస్థాన్లో బీజేపీతో సోదరభావం కలిగి ఉన్నదని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి నిజాయితీ గల ఆప్ ప్రభుత్వాన్ని తెస్తారన్నారు.