న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కారు, ఎల్జీ మధ్య మరో వివాదం తలెత్తింది. ఉచిత విద్యుత్తు పథకాన్ని అడ్డుకునేందుకు ఎల్జీ సక్సేనా కుట్రలు పన్నుతున్నారని, విద్యుత్తు సంస్థలతో కుమ్మక్కయ్యారని మంత్రి ఆతిశీ ఆరోపించారు. పథకాన్ని రద్దు చేసేందుకు అత్యున్నత స్థాయిలో కుట్ర జరుగుతున్నదన్నారు.
ముఖ్యమైన ఫైల్స్ను సీఎంకు, విద్యుత్తు మంత్రికి కూడా చూపించడం లేదన్నారు. ఇదే విషయంపై సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఉచిత విద్యుత్తు పథకంతో ప్రజలు లబ్ధిపొందుతుండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపింది. సబ్సిడీ పథకాన్ని ఆపాలని చూస్తున్నది’ అని అన్నారు.