న్యూఢిల్లీ: హర్యానాలోని నూహ్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా సోమవారం రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్య చేశారు. ఒక వర్గం వాళ్లు శాంతంగా యాత్ర నిర్వహిస్తుండగా.. మరో వర్గం వాళ్లు ఆ యాత్రపై ఒక్కసారిగా దాడిచేయడం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆయన చెప్పారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని, పోలీసులు ఇప్పటివరకు పరస్పర ఘర్షణలకు దిగిన 70 మందిని అదుపులోకి తీసుకున్నారని సీఎం ఖట్టర్ వెల్లడించారు. సోమవారం నూహ్ పట్టణంలో వీహెచ్పీ శ్రేణులు ర్యాలీ నిర్వహిస్తుండగా మరో వర్గం వాళ్లు వారిపై రాళ్లు రువ్వారు. దాంతో రెండు వర్గాల వాళ్లు పరస్పర దాడులకు దిగి తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల కారణంగా ప్రస్తుతం నూహ్లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా నిషేధించారు.