న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు అత్యంత సన్నిహితుడు అయిన రాణా గుర్మీత్ సోధీ మంగళవారం కాంగ్రెస్కు పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
రాణా గుర్మీత్ సోధీకి గజేంద్రసింగ్ షెకావత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భూపేంద్రసింగ్ యాదవ్, సోంప్రకాష్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రం సరిహద్దు రాష్ట్రమని, ఇక్కడ మత సామరస్యాన్ని నెలకొల్పడం అవసమని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైందని అందుకే తాను బీజేపీలో చేరానని గుర్మీత్ సోధీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ లాంటి వ్యక్తి మాత్రమే పంజాబ్ను కాపాడగలరని ఆయన వ్యాఖ్యానించారు.