Joe Biden | న్యూఢిల్లీ : భారత్ వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ది బీస్ట్ కారులో ప్రయాణించనున్నారు. ఈ కారు బోయింగ్ సీ-17 విమానంలో యూఎస్ నుంచి ఢీల్లికి చేరుకోనుంది. ఇక బైడెన్కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), పారా మిలటరీ దళాలు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ భద్రత నిర్వహించనున్నారు.
జీ20 సమ్మిట్కు వచ్చే జో బైడెన్ ఢిల్లీలోని ఐటీసీ మౌర్య షెర్టాన్ హోటల్లో బస చేయనున్నారు. దీంతో హోటల్ను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ హోటల్లోని 14వ అంతస్తులో బైడెన్ బస చేయనున్నారు. బైడెన్ ఉన్నంత వరకు ఆ హోటల్ వద్ద నిత్యం తనిఖీలు నిర్వహించనున్నారు. 14వ అంతస్తును సందర్శించే వారికి ప్రత్యేక పాసులు జారీ చేయనున్నారు. బైడెన్ కోసం ప్రత్యేక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు.