ముంబై : కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు పరోక్షంగా బీజేపీకి అనుకూలిస్తాయని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యాలను తాము ప్రజల్లో ఎండగడతామని నానా పటోలె పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్రలో శివసేన, ఎస్పీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారం పంచుకుంటున్న క్రమంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని నానా పటోలె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహా వికాస్ అఘడి సర్కార్లో అలజడి రేగింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి రాష్ట్ర శాఖ చొరవ చూపాలని, ఎన్నికల్లో పొత్తులు లేదా ఒంటరి పోరు నిర్ణయాన్ని అధిష్టానానికి విడిచిపెట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ హెచ్కే పాటిల్ హితవు పలికారు.