మృతుల్లో ముఖ్యనాయకులు, ఆరుగురు మహిళలు
కొత్తగూడెం క్రైం: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్పట్టి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన కొందరు నక్సల్స్ ని పోలీసులు గుర్తించారు. గ్యార్పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కొందరి వివరాలను పోలీస్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆరుగురు మహిళలు సహా 26మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు.
కాగా మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ దీపక్, డీవీసీఎం మహేష్ గోటా, డీవీసీఎం లోకేష్ మడకం, మిలింద్ బాడీగార్డులు కిషన్, భగత్ లు మృతిచెందిన మావోయిస్టుల్లో ఉన్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
సంఘటనా స్థలం నుంచి 26 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆరు ఏకే-47లు, తొమ్మిది ఎస్ఎల్ఆర్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు 303రైఫిళ్లు, ఒక పిస్తోల్, తొమ్మిది 12బోర్ రైఫిళ్లను సీ-60 కమాండోలు స్వాధీనపరుచుకున్నారు. మరికొందరు మృతుల వివరాలను అధికారులు ద్రువపరచాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను గడ్చిరోలి ఎస్పీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీడియాకు వెల్లడించనున్నారు.