Bhartruhari Mahtab : లోక్సభ ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు పంపించారు. ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక నేత పార్టీ వీడటంతో బీజేడీకి పెద్ద షాకే తగలింది. ఐదోసారి అధికారం కోసం ఎన్నికల సమరంలోకి దిగుతున్న నవీన్ సర్కారుకు ఇది ఊహించని దెబ్బగానే చెప్పవచ్చు.
ఇటీవల ఒడిశా నటుడు అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేడీలో అరిందమ్ ముఖ్య నేతగా ఉన్నారు. ఎన్నికల సమయంలో హ్యాండిచ్చాడు. తాజాగా కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీని వీడారు. ఆయన కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఒడిశాలో బీజేడీతో బీజేపీ పొత్తు కుదరలేదు. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తేల్చి చెప్పారు. త్వరలో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు మన్మోహన్ సమాల్ స్పష్టం చేశారు.
21 లోక్సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని సమాల్ తెలిపారు. మోడీ సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపించబోతున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి వస్తున్న సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు చేరకుండా పోతున్నాయన్నారు. మొత్తానికి ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీతో బీజేపీకి పొత్తు లేదని తేలిపోయింది. ఇక ఆ రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి.