బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి అత్యున్నత గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్విట్టర్ (ఎక్స్)లో ప్రకటించారు. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న దక్కడం చాలా సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.
అత్యంత వినయం, కృతజ్ఞతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నా. ఇది వ్యక్తిగా నాకొక్కడికే దక్కినది కాదు. నా ఆశయాలు, సిద్ధాంతాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. జీవితంలో ఇంత దృఢంగా, నిబద్ధతతో ఉండటానికి నా కుటుంబం అందించిన సహకారం మరువలేనిది. 14 ఏండ్ల వయసులో ఆరెస్సెస్ వలంటీర్గా చేరినప్పటి నుంచి నాకు అప్పగించిన ఏ పనినైనా నిస్వార్థ్ధంగా, అంకితభావంతో చేసి దేశానికి సేవలందించా. నా జీవితంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, భారతరత్న అటల్ బిహారీ వాజపేయితో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నా.
-ఎల్కే అద్వానీ
LK Advani | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బీజేపీ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ మేరకు ఎక్స్లో ప్రకటన చేశారు. అద్వానీ భారతరత్నకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ‘ప్రస్తుత కాలంలో అత్యంత రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఆయన రాజకీయ జీవితం కొనసాగింది. ఆయన హోం మంత్రిగా పనిచేశారు.
పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగాలు ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి’ అని మోదీ ప్రశంసించారు. 96 ఏండ్ల అద్వానీ వాజ్పేయి మంత్రివర్గంలో ఉప ప్రధానిగా పనిచేశారు. అదే సమయంలో పలు కేంద్ర శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1970 నుంచి 2019 వరకు ఉభయ సభల్లో సభ్యుడిగా పనిచేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్ర చేశారు. ఈ యాత్ర హిందువులలో రామ మందిర నిర్మాణేచ్ఛ రగిల్చిందని చెప్తారు. ఈ యాత్ర వల్లే దేశంలో బీజేపీ క్షేత్ర స్థాయి నుంచి బలపడింది. బీజేపీని రెండు సీట్ల నుంచి ప్రధాని పీఠం వరకు నడిపించింది.
అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ఎన్సీపీ అధ్యక్షుడు పవార్ హర్షం వ్యక్తం చేశారు. భారత దేశ అభివృద్ధికి అద్వానీ అవిరళ కృషి చేశారని పవార్ ప్రశంసించారు. మరోవైపు తన తండ్రి దేశానికి చేసిన సేవలకు భారతరత్న ప్రకటించడం పట్ల అద్వానీ కుమారుడు జయం త్ అద్వానీ హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను, మా కుటుంబ సభ్యులు దీనికి చాలా ఆనందపడుతున్నాం. దీనికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అంటూ ఆయన పేర్కొన్నారు.
అవిభాజ్య భారత్లో 1927, నవంబర్ 8న కరాచీలోని సింధీ కుటుంబంలో జన్మించిన అద్వానీ అక్కడే సెయింట్ పాట్రిక్స్ స్కూల్లో చదివారు. తర్వాత 14 ఏండ్ల వయసులో 1941లో ఆర్ఎస్ఎస్లో చేరారు. దేశ విభజన సమయంలో ఢిల్లీకి వచ్చిన ఆయన తర్వాత రాజస్థాన్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. మృదువుగా మాట్లాడినా, దృఢమైన నిర్ణయాలు తీసుకునే అద్వానీ రామజన్మభూమి ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు. కాగా, అద్వానీ 2002 నుంచి 2004 వరకు ఏడో ఉప ప్రధానిగా సేవలందించారు. ఆయన బీజేపీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. హోం శాఖకు ఎక్కువ కాలం పనిచేసిన మంత్రిగా, లోక్సభలో ఎక్కువ కాలం విపక్ష నేతగా వ్యవహరించి రికార్డు సృష్టించారు. 1970లో తొలిసారిగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై 1989 వరకు కొనసాగారు. రామజన్మభూమి ఉద్యమానికి 1980 తర్వాత రూపం తెచ్చారు.
1990 దశకంలో ఆయన వాజ్పేయితో కలిసి పార్టీ నిర్మాణానికి ఇటుక ఇటుక పేర్చి దాని పటిష్ఠానికి పునాది వేశారు. వారి కృషి కారణంగానే 1984లో పార్లమెంట్లో కేవలం రెండు సీట్లతో ఉన్న బీజేపీ 1989 నాటికి 86 సీట్లతో నిలిచింది. బీజేపీ ప్రారంభమైన తర్వాత దీర్ఘకాలం పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన రికార్డు అద్వానీ పేరుపైనే ఉంది.
అయోధ్యలో రామజన్మభూమి ఆలయం కో సం అద్వానీ కన్న కలలు నిజమైన ఏడాదే ఆయనకు భారతరత్న ప్రకటించడం వెనుక అధికార బీజేపీ రాజకీయ ప్రయోజనాలున్నాయా? అన్న ప్రశ్నలు సైతం ఉద్భవించాయి. ఇటీవల అత్యంత ఘనంగా అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో హిందూ ఓటు బ్యాంకును గంపగుత్తగా పొందడానికేనని కొందరు విమర్శలు చేస్తున్నారు. వారి విమర్శలకు ఊతం ఇచ్చేలా రామ మందిర నిర్మాణానికి తన రథయాత్ర ద్వారా శ్రీకారం చుట్టి హిందూ సమాజంలో ఒక విధమైన కసి రగిల్చిన అద్వానీకి భారతరత్న ఇవ్వడం ద్వారా హిందూ ఓటింగ్ బ్యాంక్ను మరింత సుస్థిరం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని భావిస్తున్నారు. ఈ అవార్డుతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెల్లుబుకుతుందని, అది సార్వత్రిక ఎన్నికల్లో టానిక్లా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సమయాన ఆయనకు సరైన రీతిలో ఆహ్వానించకుండా అవమానించారన్న విమర్శలకు సైతం ఈ అవార్డు ఫుల్స్టాప్ పెట్టింది.
బాబ్రీ మసీదును కూల్చేందుకు రథయాత్ర చేసిన వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న ప్రకటించడం తప్పుడు నిర్ణయమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. 1990లో అద్వానీ యాత్ర చేసిన ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగి పెద్ద సంఖ్యలో అమాయకులు చనిపోయారని తెలిపారు.
దేశ ప్రజలు ఆర్థిక, సామాజిక సాధికారతను సాధించడానికి విశేషంగా కృషి చేసిన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు భారతరత్న ప్రకటించాలని ఆ పార్టీ శనివారం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అద్వానీకి భారతరత్న ప్రకటించిన కొద్ది సేపటికే ఆ పార్టీ ఈ విధంగా కోరింది. కాన్షీరామ్కు భారతరత్న ప్రకటించి గౌరవించాలని బీఎస్పీ నేత ఆకాశ్ ఆనంద్ శనివారం ఎక్స్లో కోరారు.
అత్యంత వినయం, కృతజ్ఞతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నట్టు అద్వానీ ప్రకటించారు. ఇది వ్యక్తిగా తనకొక్కడికే దక్కినది కాదని, తన ఆశయాలు, సిద్ధాంతాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు లభించిన సందర్భంగా దివంగత భార్య కమలతో పాటు తన కుటుంబ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు చెబుతూ జీవితంలో ఇంత దృఢంగా, నిబద్ధతతో ఉండటానికి వారి సహకారం మరువలేనిదన్నారు. 14 ఏండ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో వలంటీర్గా చేరినప్పటి నుంచి తనకు అప్పగించిన ఏ పనినైనా నిస్వార్ధంగా, అంకిత భావంతో చేసి దేశానికి సేవలందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తాను కలిసి పనిచేసిన ఇద్దరు గొప్ప వ్యక్తులను స్మరించుకుంటున్నానని, వారిలో ఒకరు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ కాగా, మరొకరు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయని చెప్పారు. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు, స్వయం సేవక్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.