న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కూడా కొవాగ్జిన్ ప్రికాషన్ డోసు ధరను తగ్గించింది. ప్రైవేటు ఆసుపత్రులకు డోసు ధర రూ.1200 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా శనివారం తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారందరికీ ప్రికాషనరీ డోసు అందుబాటులో ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులకు కొవాగ్జిన్ ప్రికాషన్ డోసు ధర రూ.1200 నుంచి రూ.225కు తగ్గించినట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె ట్వీట్ చేశారు.
కాగా, దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం రేపుతున్నది. మహారాష్ట్ర, గుజరాత్లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో కరోనా ఫోర్త్ వేవ్పై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రికాషన్ డోసుగా పేర్కొనే బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏండ్లు నిండి, సెకండ్ డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు అర్హులని తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో బూస్టర్ డోసు టీకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
అయితే ప్రికాషనరీ డోసు ఉచితం కాదు. బూస్టర్ డోసు కావాలనుకునేవారు డబ్బులు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించి కొవిన్లో రిజిస్ట్రేషన్ కోసం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తొలుత కొవిషీల్డ్ ప్రికాషనరీ డోసు ధర రూ.600గా సీరం ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. దీనికి పన్నులు అదనమని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఈ ధరను రూ.225కు తగ్గించినట్లు శనివారం ట్వీట్ చేశారు.
ఆ వెంటనే భారత్ బయోటెక్ కూడా కొవాగ్జిన్ ప్రికాషనరీ డోసు ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గించినట్లు ప్రకటించింది. అయితే సర్వీస్ చార్జీ గరిష్ఠంగా రూ.150 మాత్రమే ఉండాలని కేంద్రం శనివారం ప్రకటించింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ ప్రికాషనరీ డోసు ధర సుమారు రూ.325 నుంచి రూ.375 వరకు ఉండనున్నది.
Announcing #CovaxinPricing .
We welcome the decision to make available precautionary dose for all adults. In consultation with the Central Government, we have decided to revise the price of #COVAXIN from Rs 1200 to Rs 225 per dose, for #privatehospitals.🇮🇳💉💉💉😷— Suchitra Ella (@SuchitraElla) April 9, 2022