న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12న భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఆ సంఘం కన్వీనర్ హన్నన్ మొల్లా మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల వాణిజ్య ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అమెరికా నేర్పరితనానికి భారత ప్రభుత్వం లొంగిపోయిందని ఆయన ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంతి పీయూష్ గోయల్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయన భారత రైతులను మోసగించారని, దీనిపై తాము రైతుల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఈ నెల 12న భారత్ బంద్కు పిలుపునిచ్చామని చెప్పారు. ఒప్పందం ప్రకారం అమెరికా చౌక ఉత్పత్తులు భారత్ మార్కెట్లను ముంచెత్తుతాయని, వారితో పోటీని మన రైతులు తట్టుకోలేక, అంతమవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ మంగళవారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము రైతుల ప్రయోజనాలను పరిరక్షించినట్టు కేంద్రం అబద్ధాలు ఆడుతున్నదని విమర్శించారు. ‘ఇది ఒత్తిడితో చేసుకున్న ఒప్పందం. ఏకపక్షంగా చేసుకున్న ఒప్పందం.
రైతులను ముంచేసే ఒప్పందం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వారు (అమెరికా) తమ సబ్సిడీ సరుకులను భారత్ మార్కెట్లో గుమ్మరించేస్తారు. దాంతో భారత రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకోలేరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 12న నిర్వహించనున్న భారత్ బంద్కు ఆయన మద్దతు ప్రకటిస్తూ ‘ఢిల్లీ మనకు ఎంతో దూరంలో లేదు. మన ట్రాక్టర్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం భారత్కు ఎంతమాత్రం మేలు చేసేది కాదని అన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లును కూడా ఆయన వ్యతిరేకిస్తూ దీని కారణంగా రైతులు ఖరీదైన విత్తనాలు కొనాల్సిన అవసరం ఏర్పడుతుందని అన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ గత ఏడాది 3 శాతం ఉన్న అమెరికా టారిఫ్లు ఇప్పుడు 18 శాతానికి పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయంలో స్వేచ్ఛా మార్కెట్ అంటే రైతులకు మరణశిక్షేనని ఆయన పేర్కొన్నారు.