న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేపై సర్హౌల్ బోర్డర్ వద్ద భారీ స్థాయిలో ట్రాఫిక్ జామైంది. వచ్చిపోయే వాహనాలను ఢిల్లీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో ఎక్స్ప్రెస్వేపై ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఏపీలోని విజయవాడలో రైల్వే స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లోకి ఆందోళనకారులు ప్రవేశించకుండా ఉండేందుకు వైర్లను అమర్చారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు.
ఇక యూపీలోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. భారత్ బంద్ నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేశారు. కనీసం 4 గంటల నుంచి స్టేషన్లో ఎదురుచూస్తున్నట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. ట్రైన్ స్టేటస్ చెక్ చేస్తే రద్దు అయినట్లు లేదని, కానీ స్టేషన్కు వస్తే ఆ రైలును రద్దు చేసినట్లు చెబుతున్నారని ప్రయాణికులు ఆరోపించారు.
ఢిల్లీలో కొందరు కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంలోనూ కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. మల్లిఖార్జున్ ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, కే సురేశ్, వీ నారాయణస్వామితో పాటు ఇతర నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాల్లో నిరసనలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ పాటిస్తున్నారు.