Punjab Polls | ఆప్ తన సీఎం అభ్యర్థిని ప్రకటించింది. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపీగా వున్న భగవంత్ మాన్ను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రజలే నిర్ణయించుకుంటారని, అందుకోసం ఫోన్ నెంబర్, వాట్సాప్, ఎస్ఎంఎస్ సదుపాయాలను కల్పిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించిన విషయం విదితమే. ఈ ఫీడ్బ్యాక్లో మొత్తం 19 లక్షల మంది పాల్గొంటే.. 90 శాతం మంది భగవంత్కే జై కొట్టారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
1973, అక్టోబర్ 17న భగవంత్ మాన్ జన్మించారు. పంజాబ్లోని సతోజ్ ప్రాంతంలో జన్మించారు. ఇంటర్ వరకూ విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత బీకాం కోసం కాలేజీలో చేరారు. అయితే మధ్యలోనే చదువును ఆపేశారు. (డ్రాపౌట్). ఆ తర్వాత ఓ కమెడియన్గా కెరీర్ను ఎంచుకున్నారు. పలు టీవీ షోల్లో కూడా పాల్గొన్నారు. మెళ్లి మెళ్లి కమెడియన్గా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఓ భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య పేరు ఇంద్రప్రీత్ కౌర్.
భగవంత్ మాన్ ప్రస్తుతం భార్య ఇంద్రప్రీత్ కౌర్ నుంచి దూరంగా ఉంటున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. కమెడియన్గా కెరీర్ ఉన్న సమయంలో కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం, సమయం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రజలకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఇది తన భార్యకు రుచించలేదని, అందుకే భార్య తన దగ్గర ఉండటం లేదని, పిల్లలతో కలిసి అమెరికాలో వుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం తాను పంజాబ్లోనే ఉంటున్నానని, పంజాబ్ ప్రజలే తన కుటుంబీకులని భగవంత్ మాన్ వెల్లడించారు.
2014 లో భగవంత్ మాన్ ఆమ్ఆద్మీ పార్టీలో చేరారు. సంగరూర్ లోక్సభ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2019 లో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలుపొందారు. లక్ష ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థిపై భగవంత్ మాన్ విజయం సాధించారు. 2014 లో ఆప్లో చేరిన తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగా ముద్రపడ్డారు.