తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మునుగుతారని, ఇతరులను కూడా ముంచుతారని విమర్శించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం త్రిశూర్లో బీజేపీ తరుఫున రాజ్నాథ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇటీవల కేరళ మత్య్సకారులతో కలిసి సముద్రంలోకి దూకిన సంగతిని గుర్తు చేశారు.
రాహుల్తో జాగ్రత్త, ఆయన ట్రాక్ రికార్డ్ మంచిది కాదు అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. రాహుల్ ఎక్కడికి వెళ్ళినా, ఆయన మునుగుతారు, ఇతరులను ముంచేస్తారని ఎద్దేవా చేశారు. అమేథి ప్రజలను అడిగితే దీని గురించి చెబుతారని, గతంలో ఆయన ఎంపీగా ఉన్న ఆ నియోజకవర్గం ఇంకా వెనుకబడి ఉందన్నారు. ఇప్పుడు వయనాడ్ను ముంచేందుకు రాహుల్ ఇక్కడికి వచ్చారని ఆరోపించారు.
కేరళలోని అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం, సీఎం విజయన్పైనా రాజ్నాథ్ సింగ్ పలు విమర్శలు చేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒక్కటేనని, ఆ కూటముల నుంచి కేరళ విముక్తి పొందాలని అన్నారు. మరోవైపు వాతావరణం అనుకూలించక ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా ల్యాండ్ కావడంతో ఎర్నాకుళంలో బీజేపీ తలపెట్టిన రోడ్ షోను రద్దు చేశారు.