న్యూఢిల్లీ: విదేశాల్లో ఐటీ జాబ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ యువతను కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) హెచ్చరించింది. ఇందుకు సంబంధించి శనివారం పలు సూచనలు జారీచేసింది. ఐటీ నైపుణ్యమున్న యువతను ఫేక్ జాబ్ రాకెట్స్ లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపింది. థాయ్లాండ్లో డేటా ఎంట్రీ జాబ్స్ పేరుతో ఇండియా, దుబాయ్ ఏజెంట్లు సోషల్మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారని వెల్లడించింది. డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాల కోసం యువతను థాయ్లాండ్ రప్పించుకొని, వారిని అక్రమంగా మయన్మార్కు తరలిస్తున్నదని చెప్పింది. అనంతరం వారిని కాల్ సెంటర్ స్కామ్స్, క్రిప్టో కరెన్సీ మోసాలకు వాడుకొంటున్నారని వెల్లడించింది. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది యువత విదేశాల్లో బందీలుగా మారుతున్నారని తెలిపింది. ఉపాధి కోసం టూరిస్టు లేదా విజిట్ వీసాపై విదేశాలకు వెళ్లేముందు ఆయా కంపెనీల వివరాలను ఆయా దేశాల్లోని దౌత్యకార్యాలయాలనుంచి తెలుసుకోవాలని సూచించింది. తాజాగా, మయన్మార్లో ఫేక్ జాబ్ రాకెట్స్ వలలో వందల మంది చిక్కుకొన్నారు. వారిలో 32 మందిని కేంద్ర విదేశాంగ శాఖ రక్షించింది. మిగతావారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.