Modi | మునుపటి వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని కూడా ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగరూకతతో ఉండడం మాత్రం అత్యంత ఆవశ్యకమని మోదీ అభిప్రాయపడ్డారు. అయితే కరోనాపై పోరులో వ్యాక్సిన్లే కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోడానికి ఓ సామూహిక విధానం అవసరమని, అందరం కలిసి కట్టుగా ఉంటేనే ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడగలమని మోదీ అభిప్రాయపడ్డారు. అయితే మన మన ఇళ్లల్లో తర తరాలుగా వస్తున్న హోం రెమెడీస్ కరోనా పోరులో ఉపయోగపడొచ్చన్నారు. థర్డ్ వేవ్ను ఎదుర్కోడానికి కేంద్ర అన్ని రకాలుగా సన్నద్ధమైందని, వైద్య రంగంలో మౌలిక వసతులను కూడా పెంచిందని, దాదాపు 800 పీడియాట్రిక్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశామని సీఎంల దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత సమయంలో చాలా వరకు చికిత్స హోం ఐసోలేషన్లోనే చేసుకోవచ్చని, టెలీ మెడిసన్లపై కూడా దృష్టి సారించామని తెలిపారు.
దేశంలో మొదటి డోసు దాదాపు 92 శాతం వ్యాక్సిన్ పూర్తైందని, ఇది దేశానికే గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ఇక కరోనా రెండో డోసు కూడా 70 శాతం మేర పూర్తైందని పేర్కొన్నారు. పండగల సమయంలో ఏమాత్రం అజాగ్రత్తతో ఉండవద్దని, అత్యంత జాగ్రత్తగా మెలగాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘రెండేళ్లుగా కరోనాతో పోరాడుతున్నాం. ఈ పోరాటపు అనుభవం మనకుంది. ప్రజల ఉపాధిని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. అందుకే కంటైయిన్మెంట్లపై దృష్టి నిలపాలి. హోం ఐసోలేషన్లోనే చికిత్స జరిగిపోయేట్లుగా మనం చూసుకోవాలి. కోవిడ్కు చెందిన అన్ని వెరియంట్లను ఎదుర్కొనేలా మన సన్నద్ధత ఉండాలి. ఒమిక్రాన్ తర్వాత వచ్చే వేరియంట్లపై కూడా దృష్టి సారించాలి. ఈ పోరులో ఒకరికొకరం సహాయం చేసుకుందాం’ అని మోదీ పిలుపునిచ్చారు.