బెంగళూరు, జూన్ 9: సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న స్థితిపై బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్షా మరోసారి మండిపడ్డారు. గుంతల రోడ్లు ‘దిగ్భ్రాంతికరం, సిగ్గు చేటు’ అంటూ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ఓ ఇంగ్లిష్ పత్రికకు చెందిన ఫొ టో జర్నలిస్టు బెంగళూరు-మైసూర్ రోడ్డుపై గల నైస్ జంక్షన్ వద్ద రోడ్ల దుస్థితి ఎండగడుతూ వీడియో పోస్టు చేశారు.
రోడ్డుకూరోడ్డుకూ మధ్య గుంతలున్నాయా? లేక గుంతకుగుంతకూ మధ్య రోడ్డు ఉన్నదా? అంటూ సదరు ఫొటో జర్నలిస్టు పెట్టిన కామెంట్ వైరల్ అయింది. రోడ్ల మీదున్న గుంతలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయని దుయ్యబట్టారు. దీనిపైనే కిరణ్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిరోడ్లు లేనప్పుడు ప్రభుత్వం డిపోలు, క్వార్టర్లు ఎందుకు కడుతుందో తెలియడం లేదని కడిగేశారు. స్థానిక రాజకీయ నేతలు సిగ్గుపడాలి అని తీవ్రస్థాయిలో అక్షింతలు వేశారు.