బెంగళూర్ : ట్రాఫిక్ పద్మవ్యూహంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే బారులుతీరే దృశ్యాలు ఏండ్ల తరబడి బెంగళూర్లో కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు రూ. 20,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సిటీ ప్లానింగ్, మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందుల ఫలితంగా బెంగళూర్కు వేల కోట్ల నష్టం ఎదురవుతున్నదని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ సర్వే బెంగళూర్లో రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, మౌలిక వసతుల్లో లోటుపాట్ల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది.
ట్రాఫిక్ కడగండ్ల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావాన్ని అధ్యయనం విశ్లేషించింది. నగర ఉత్పాదకత, ఆర్ధిక వృద్ధికి ట్రాఫిక్ కష్టాలు అవరోధంగా మారాయని ఈ సర్వే తేల్చింది. బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలిచే ఐటీ పరిశ్రమపై ఇది అత్యధిక ప్రభావం చూపుతోంది. టెకీలు, ఐటీ ఉద్యోగులు గంటల కొద్దీ నగర రోడ్లపై చిక్కుకుపోవడంతో అది ఉత్పాదకతపై ప్రభావం చూపుతోంది. ట్రాఫిక్ ఇబ్బందులతో కేవలం ఐటీ రంగంలోనే రూ. 7000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఎంఎస్ఎంఈల రంగానికి ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా రూ. 3500 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
ఎకానమీకి నష్టం కలిగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యతో వాహనాల నుంచి వెలువడే వాయువులు నగర పర్యావరణంపై పెను ప్రభావం చూపడంతో పాటు కాలుష్యం పెరుగుతున్నది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సమగ్రమైన పరిష్కారాలు, ప్రణాళికలు అవసరమని అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించకుంటే అది నగర ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయడంతో పాటు పౌరుల జీవన ప్రమాణాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
Read More :
Mahaveerudu Movie | అప్పుడే ఓటీటీలోకి మహావీరుడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?