Crime News : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను కొందరు వ్యక్తులు కిడ్నాప్ (Kidnap) చేసి, రోజుల తరబడి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. బలవంతంగా ఆమె దుస్తులు విప్పించి వీడియో తీశారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు సుంకడకట్టే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం రేష్మా బాను అనే మహిళ వద్ద రూ.లక్ష, నజ్రత్ బేగం అనే మహిళ వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులవల్ల కొన్ని నెలలుగా వాయిదాలు చెల్లించలేకపోయారు. దాంతో ఆగస్టు 27న పని ఇప్పిస్తానని చెప్పి నజ్రత్ బేగం.. సదరు మహిళను తన ఇంటికి పిలిచింది. మహిళ అక్కడికి రాగానే.. రేష్మా, ఆమె భర్త సుహైల్, మరో వ్యక్తి సైఫ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు. కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు. కుంబల్గోడులోని రేష్మా ఇంటికి తీసుకెళ్లారు.
అక్కడ ఆమెను నాలుగు రోజులపాటు బంధించి కర్రలతో కొట్టారు. అసలు, వడ్డీ కలిపి రూ.11 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 29న ఆమె దుస్తులు విప్పేసి బలవంతంగా అర్ధనగ్నంగా మార్చారు. డబ్బు చెల్లించకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని, వేశ్యావృత్తిలోకి దించుతామని బెదిరించారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు రేష్మా బాను, సుహైల్, నజ్రత్ బేగం, సైఫ్లను అరెస్ట్ చేశారు. వాళ్లపై కిడ్నాపింగ్, దాడి, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.