Bengaluru | బెంగళూరు, మార్చి 8: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నది. తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు నగర జలమండలి సరిపడా నీరు సరఫరా చేయకపోవడంతో పాటు మరోవైపు బోర్లు కూడా ఎండిపోతున్న నేపథ్యంలో ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితిని నెలకొన్నది. నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బెంగళూరు నీటి సరఫరా బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. తాగునీటిని వృథా చేయొద్దని ప్రజలను కోరింది. ఉల్లంఘనకు పాల్పడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని అవసరాల మేరకు వినియోగించాలని సూచించింది. తాగునీటిని వాహనాలను తుడిచేందుకు, నిర్మాణం, వినోద కార్యకలాపాల్లో వాడొద్దని, అదేవిధంగా సినిమా హాళ్లు, మాల్స్లో తాగునీటి అవసరాల మినహా ఇతరత్రా కోసం వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై మొదటగా రూ.5 వేలు జరిమానా పడుతుందని, పదేపదే నీటి వృథాతో ఉల్లంఘనకు పాల్పడితే అదనంగా ప్రతిసారి రూ.500 చొప్పున ఫైన్గా చెల్లించాల్సి ఉంటుందని బెంగళూరు జలమండలి హెచ్చరించింది.
నగరంలో రోజుకు 2,600-2,800 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతున్నది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. మరోవైపు ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోవు రోజుల్లో పరిస్థితి ఇంకా ఎంత స్థాయికి దిగజారుతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లోని పలు ప్రాంతాలోనూ నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ గుర్తించింది.