Bengaluru | బెంగళూరు, ఫిబ్రవరి 23: వేసవికి ఇంకా కొన్ని వారాల సమయమున్నది. అప్పుడే బెంగళూరు మహానగరం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ధరలు రెండింతలు పెంచేసిందని స్థానికులు వాపోతున్నారు. భారత దేశ సిలికాన్ వ్యాలీని జనవరి మధ్య నుంచే నీటి కొరత పట్టిపీడిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు తగ్గిపోతున్న భూగర్భ జలాలు, దీనికి తోడు ట్యాంకర్ల అధిక ధరలు నగరవాసుల కష్టాలను మరింత పెంచుతున్నాయి. ఐటీ కంపెనీలు, స్టార్టప్లకు నిలయమైన బెంగళూరులో కోటి జనాభా నివసిస్తున్నది. వర్షాభావం, బోర్వెల్స్ ఎండిపోవటం, భూగర్భ జలాలు అడుగంటిపోవటం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం, ట్యాంకర్ల దోపిడీ, కాంగ్రెస్ సర్కారు అలసత్వం.. అన్నీ కలిసి నగరాన్ని నీటి సంక్షోభంలో ముంచేశాయి.
నగర నీటి సరఫరాకు బాధ్యత వహించే బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) నగర నీటి అవసరాలు తీర్చటానికి అధికంగా కావేరీ నదిపై ఆధారపడుతున్నది. కావేరీ నీటి కనెక్షన్లు లేని ప్రాంతాలు బోర్వెల్స్, ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. కావేరీ నది నుంచి బెంగళూరు నగరానికి రోజుకు 1450 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ నగరానికి మరో 1680 మిలియన్ లీటర్ల అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ నీటి అవసరాలు తీర్చుకునేందుకు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గత రెండు నెలల్లోనే ట్యాంకర్ల ధరలు రెట్టింపు అయ్యాయి. ఒకప్పుడు ప్రైవేటు ట్యాంకర్ రూ.1500లకు వస్తుండగా.. ఇప్పుడు దాని రేటు రెట్టింపు అయ్యింది. నెలకు ప్రైవేటు ట్యాంకర్లపైనే సుమారు రూ.6 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. గతంలో ఈ ఖర్చు కేవలం రూ.700 ఉండేది. జనవరి మధ్య నుంచే నీటి ట్యాంకర్ల రేట్లు విపరీతంగా పెరిగాయని స్థానికులు వాపోతున్నారు. 12 వేల లీటర్ల ట్యాంకర్ ధర ఒకప్పుడు రూ. 1200 కాగా.. ఇప్పుడది రూ.2000 దాటిపోయింది.