బెంగళూరు, సెప్టెంబర్ 12:బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు, ఓ వైద్యునికి వృత్తి పట్ల గల అంకితభావానికి అద్దం పట్టే ఘటన ఇది. సర్జాపూర్లోని మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ గత 30న అర్జెంట్గా ఓ మహిళకు చేయాల్సిన గాల్బ్లాడర్ సర్జరీ కోసం దవాఖానకు వెళ్తున్నారు. బెంగళూరు నత్తనడక ట్రాఫిక్ ఆయనను కదలనీయలేదు. మరహతహళ్లి ప్రాంతంలోని సర్జాపూర్లో ఆయన ట్రాఫిక్లో చిక్కుకున్నారు. కారును నమ్ముకుంటే దవాఖానకు సకాలంలో చేరడం అసాధ్యం. ఆలస్యం చేస్తే పేషెంటుకు ప్రమాదం. దవాఖానలో తన టీమ్ అన్నీ సిద్ధం చేసి ఎదురు చూస్తున్నది. దాంతో ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు దిగి పరుగు ప్రారంభించారు. 3 కిలోమీటర్ల దూరం 45 నిమిషాల పాటు పరుగెత్తి దవాఖానకు చేరుకున్నారు. ఆపరేషన్ సకాలంలో, విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంటు డిశ్చార్జి అయ్యారు కూడా. ఈ ఉదంతం నెట్లో వైరల్ అవుతున్నది.