Bengaluru | బెంగళూరు, మార్చి 6: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంతాల్లో నీటి రేషనింగ్ను ప్రారంభించాయి. అదేవిధంగా నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ వాహనాలను నీటితో కడుగడంతో పాటు స్విమ్మింగ్ ఫూల్ కార్యకలాపాలపై కూడా సొసైటీలు నిషేధం విధించాయి. దక్షిణ బెంగళూరు కనకపుర రోడ్లోని ప్రెస్టిజ్ ఫాల్కన్ సిటీ(పీఎఫ్సీ) అపార్ట్మెంట్స్ అసోసియేషన్ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని రెసిడెంట్లను కోరింది.
కడిగేందుకు నీరు అవసరం లేని డిస్పోజబుల్(వినియోగించి పడేసేవి) ప్లేట్లు, అదేవిధంగా చేతులు, ముఖం కడుక్కునేందుకు ‘వెట్ వైప్స్’ వినియోగించడంపై ఆలోచన చేయాలని కోరడం బెంగళూరులో నీటి సంక్షోభానికి తార్కాణంగా నిలుస్తున్నది. పీఎఫ్సీ అసోసియేషన్ అధ్యక్షుడు వసంత్ కుమార్ మాట్లాడుతూ ట్యాంకర్ల ద్వారా నీరు అందుతాయా? లేదా? అనే ఆందోళన కూడా ఉన్నదని, అందుకే ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.