బెంగళూరు,జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తన చావుకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి, మరో ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడడం కర్ణాటకలో కలకలం రేపింది. మృతుడిని బెంగళూరుకు చెందిన అమలిపురా నివాసి ప్రదీప్గా గుర్తించారు. అతడు సూసైడ్ నోట్లో తన మరణానికి కర్ణాటక మాజీ మంత్రి, మహదేవపుర బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి, పలుకుబడి కలిగిన మరో ఐదుగురు వ్యక్తులు కారణమంటూ ఆరోపించి వారి పూర్తి వివరాలు ఫోన్ నంబర్లతో సహా రాశాడు. బెంగళూరుకు సమీపంలోని నెట్టగెరె పట్టణంలో ఉన్న రిసార్టుకు ప్రదీప్ నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం వెళ్లాడు. మధ్యలో తిరిగి బెంగళూరు వచ్చి సూసైడ్ నోట్ రాసిన ప్రదీప్ తిరిగి రిసార్టుకు చేరుకుని సోమవారం రిసార్ట్ బయట కారులోనే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రిసార్టు వ్యాపారంలో తనను భాగస్వామిని చేసుకుంటానంటే ఆ ఐదుగురు వ్యక్తులకు రూ.కోటిన్నర ఇచ్చానని, అయితే వారు తనను మోసం చేశారన్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.