బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. తన బిడ్డ చీటికి మాటికి పక్కింటికి వెళ్లి ఆడుకుంటున్నదని ఓ తల్లి ఆమె చేయి కాల్చింది. నగరంలోని హెబ్బల్ ఏరియాలో జూన్ మూడో వారంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో ఓ 35 ఏండ్ల మహిళ భర్తతో విడిపోయి తన రెండో కుమార్తెతో కలిసి ఉంటోంది. ఆమె భర్త పెద్ద కుమార్తె వేరుగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో తన బిడ్డ తరచూ పక్కింట్లోకి వెళ్లి ఆడుకుంటుండటంపై సదరు మహిళ అసహనానికి గురయ్యేది. ఈ క్రమంలోనే ఓ రోజు మహిళ పనికి వెళ్లొచ్చేసరికి బాలిక పక్కింట్లో ఆడుకుంటున్నది. దాంతో ఆగ్రహానికి గురైన మహిళ బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి క్యాండిల్తో కుడిచేతిని కాల్చింది. జూన్ మూడో వారంలో ఈ ఘటన జరుగగా గత సోమవారం బయటపడింది. గత సోమవారం ఆడుకుంటూ బాలిక కిందపడి పోయింది.
దాంతో తల్లి ఆస్పత్రికి తరలించగా వైద్యులు చేతిపై ఉన్న గాయాల గురించి ప్రశ్నించారు. క్యాండిల్తో కాల్చినట్లు మహిళ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం ఆమె బెయిల్పై జైలు నుంచి బయటికి వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు.