న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన జరిగింది. సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఏడు మంది జడ్జీలను నిరసనకారులు సుమారు 9 గంటల పాటు నిర్బంధించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని ఆ నిరసనకారులు ఆరోపించారు. ఈ ఘటన మాల్దాలో జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రభుత్వం ఓ లెక్క ప్రకారం, ఈ చర్యకు పాల్పడినట్లు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. బెంగాల్ సర్కారుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన పట్ల సీబీఐ, ఎన్ఐఏతో దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆ దర్యాప్తును తాము మానిటర్ చేస్తామని కోర్టు చెప్పింది.
బుధవారం నిరసనకారులు ఏడుగురు జుడిషియల్ ఆఫీసర్లను నిర్బంధించారు. దాంట్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆ ఆఫీసర్లను ఘెరావ్ చేశారు. ఆఫీసర్లను 3.30 నిమిషాలకు నిర్బంధించారని, మధ్యరాత్రి వాళ్లను రెస్క్యూ చేశారని చీఫ్ జస్టిస్ తెలిపారు. రాత్రి 2 గంటల వరకు ఈ ఘటనను మానిటర్ చేయాల్సి వచ్చిందని సూర్యకాంత్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నిన్న జరిగిన ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అన్నారు. స్పెషల్ ఆఫీసర్లను రక్షించేందుకే తాము ఉన్నామని, వాళ్లు ఇచ్చే ఆదేశాలు.. కోర్టు ఇచ్చిన ఆదేశాలుగా పరిగణిస్తామని బాగ్చి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే బలగాలను తీసుకువచ్చి జుడిషియల్ ఆఫీసర్లకు రక్షణ కల్పించాలని జస్టిస్ బాగ్చి చెప్పారు.
ఆఫీసర్లను రక్షించేందుకు కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఆ రాష్ట్ర డీజీపీకి, హోంశాఖ కార్యదర్శికి ఫోన్ చేయాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు. అర్థరాత్రి రిలీజై ఇంటికి వెళ్తున్న సమయంలోనూ ఆ ఆఫీసర్ల వాహనాలపై రాళ్లు రువ్వినట్లు కూడా సీజేఐ చెప్పారు. జుడిషియల్ అధికారుల్ని బెదిరించడం అంటే న్యాయవ్యవస్థను సవాల్ చేయడమే అవుతుందని, ఇదేమీ రొటీన్గా జరిగే ఘటన కాదు అని, కానీ ఓ పక్కా ప్లాన్ ప్రకారం , జడ్జీలను నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో చేసినట్లుగా ఉందని సీజే అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోనివ్వబోమని, ఆఫీసర్లను మానసిక క్షోభకు గురిచేయనివ్వబోమని, బెంగాల్ సర్కారు ఈ ఘటన పట్ల వివరణ ఇవ్వాలని, ముందుగా చెప్పినా ఎందుకు ఆ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. సీబీఐ లేదా ఎన్ఐఏ ఇచ్చే నివేదికను తమకు నేరుగా సమర్పించాలని కోర్టు తెలిపింది.