కోల్కతా, సెప్టెంబర్ 19: పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మితిమీరిన దాడులను వ్యతిరేకిస్తూ సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. సొంత ప్రయోజనాల కోసం బీజేపీలోని ఓ వర్గం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధిని, బీజేపీ ప్రయోజనాలను వేర్వేరుగానే చూడాలని ప్రధాని మోదీకి హితవు చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నది. ఈ తీర్మానం ఏ ఒక్కరికో వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థల పక్షపాత వైఖరికి వ్యతిరేకంగానే’ అని ఆమె వెల్లడించారు. అనంతరం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. దీన్ని ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకించింది.
పార్థ చటర్జీ ఆస్తులు అటాచ్
టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల ఆస్తులను సోమవారం ఈడీ అటాచ్ చేసింది. అందులో రూ.40.33 కోట్ల విలువైన 40 స్థిరాస్తులు, 35 బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన రూ.7.89 కోట్ల నగదు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోమవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని 2020లో సీబీఐ నమోదు చేసిన కేసులోనే శివకుమార్కు తాజాగా ఈడీ సమన్లు జారీచేసినట్టు సమాచారం. అయితే, ఏ కేసులో భాగంగా విచారిస్తున్నారో తనకు తెలియదని శివకుమార్ పేర్కొన్నారు.