కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి సాక్షాత్తూ శాసనసభలోనే తమ పార్టీకి చెందిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలను బెదిరించారు. మీపై ఐటీ దాడులు చేయిస్తానని హెచ్చరించారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో సువేందుపై చర్యలు తీసుకునేలా సభ ప్రివిలేజ్ మోషన్ (సభాహక్కుల ఉల్లంఘన)ను ఆమోదించింది. ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో సువేందు మాట్లాడుతుండగా ఈ నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో కోపం వచ్చిన ఆయన సభ నుంచి బయటికి వెళ్తూ ఐటీ దాడులు చేయిస్తానని బెదిరించారంటూ ఆ నలుగురు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సువేందుపై చర్యలు తీసుకునేలా గురువారం సభ ప్రివిలేజ్ మోషన్ను ఆమోదించింది. వెంటనే దీన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపింది. ఆ కమిటీ పరిశీలించి నివేదిక సమర్పించగానే సువేందుపై చర్యలు తీసుకునే అవకాశముంది. స్పీకర్ బిమన్ బెనర్జీ మాట్లాడుతూ ‘సువేందుపై ఫిర్యాదు రాగానే రికార్డులను పరిశీలించాను. ఆయన తప్పు చేసినట్టు తెలుస్తున్నది. ఇది తీవ్రమైన నేరం లాంటిదే. కాబట్టి సభా నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.