మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, వాడిపోయిన ముఖంతో కనిపించే బిచ్చగాళ్లని చూడగానే జాలేస్తుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. దాంతో మన శక్తి మేరకు తోచిన సాయం చేస్తాం. తీర్థయాత్రలకు, విహార యాత్రలకు వెళ్లినప్పుడైతే హ్యాప్పీ మూడ్లో ఉంటాం కాబట్టి ఇంకాస్త ఎక్కువగానే దానం చేస్తాం. జనాల్లోని ఈ బలహీనతే భిక్షగాళ్లలా బతుకుతున్న లక్షాధికారులకు బలంగా మారుతున్నది. భిక్షాటన చేసి లక్షలు పోగేస్తున్నారు. అలా లక్షలు కూడగట్టిన ఓ భిక్షగత్తె పోలీసులకు చిక్కిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్లో ఓ మహిళ భిక్షాటన చేస్తుంది. ఆకలితో అలమటిస్తున్నట్టుగా ఆమె చూసే చూపులు, అక్కడక్కడా చిరిగి మాసిపోయి ఉన్న దుస్తులు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. అయ్యో పాపం అని పదో పరకో ఇవ్వాలనిపిస్తుంది. ఇలా జనంలోని దయా గుణాన్ని ఆమె ఆదాయ మార్గంగా మార్చుకుంది. కేవలం 45 రోజులకు రూ. 2.5 లక్షల చొప్పున సంపాదిస్తున్నది. ఇండోర్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఆ మహిళ పట్టుబడింది. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది.
ప్రతి 45 రోజులకు ఆమె సంపాదించిన రూ.2.5 లక్షల నుంచి ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉన్న ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందట. మరో రూ.50 వేలను పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందట. మిగతా సొమ్మును ఆమె తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతుందట. అప్పటికే నోరెళ్లబెట్టిన పోలీసులకు ఆ భిక్షగత్తె మరో షాకిచ్చింది. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లెలు, తమ ఇద్దరు పెద్ద పిల్లలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ కుటుంబం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే మార్గంలో వేర్వేరు కూడళ్లలో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. దాంతో వాళ్లను కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పారిపోయారు. అయినా పోలీసులు వాళ్లను గాలించి అరెస్ట్ చేశారు.
అయితే, తమను అరెస్ట్ చేసిన పోలీసులకు ఆ భిక్షగత్తె ఎదురు ప్రశ్నలు వేసింది. తామేమి దొంగతనాలు చేయడం లేదని, చేయిచాచి అడుక్కుని డబ్బు సంపాదిస్తున్నామని వాదనకు దిగింది. కాగా, ఆ భిక్షగత్తెను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె దగ్గర రూ.19,200 నగదు లభ్యమైందని ఇండోర్ పోలీసులు తెలిపారు. ఆమె ఏడాదికి రూ.20 లక్షలకు పైగానే సంపాదిస్తుందని అంచనా వేశారు. సదరు మహిళ కుటుంబం ప్రస్తుతం ఒక మిలియనీర్ రేంజ్లో ఉందని, వారికి ఖరీదైన ఇల్లు, స్మార్ట్ ఫోన్లు, పెద్ద ఎత్తున బ్యాంక్ బాలెన్స్లు ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ మహిళ గత ఏడాది కూడా పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా మళ్లీ యాచక వృత్తినే కొనసాగిస్తూ మరోసారి చిక్కిందని తెలిపారు. ఇండోర్ సిటీలో దాదాపు 7 వేల మంది దాక యాచకులు ఉన్నారని, వారిలో 98.7% మంది యాచన ద్వారా దండిగా డబ్బులు సంపాదించిన లక్షాధికారులేనని పోలీసులు వెల్లడించారు.
పన్ను లేని సంపాదన..
కాగా, భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం.. ఏడాదికి రూ.20 లక్షలకు పైగా సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మొత్తం 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మందికి మాత్రమే ఏడాదికి రూ.20 లక్షల కంటే ఎక్కువ సంపాదన ఉంది. దేశంలోని ఆ ఐదు లక్షల మంది కోటీశ్వరుల స్థాయిలో డబ్బులు సంపాదిస్తున్నా భిక్షగాళ్లు పన్ను లెక్కల్లోకి రావడం లేదు.
ప్రతి నగరంలో యాచక ముఠాలు..
ఒక్క ఇండోర్లోనే కాదు, దేశంలోని పలు నగరాల్లో యాచక ముఠాలు ఉన్నాయి. పెద్ద నగరాల్లో అయితే దాదాపు ఆరు నుంచి ఏడు వేల మంది భిక్షాటన చేస్తున్నారు. అందులో పిల్లల సంఖ్యే మూడు వేలకు పైగా ఉంది. వీరిలో యాచక ముఠాల చెరలో చిక్కి అనివార్యంగా భిక్షాటన చేస్తున్నవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. యాచక వృత్తి మంచి ఆదాయ వనరుగా మారడంతో ముఠాలు పెద్ద సంఖ్యలో అభాగ్యులను ఈ వృత్తిలో దించుతున్నాయి. ఈ వ్యాపారానికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సామాజిక సేవకులు చెబుతున్నారు.