Spyware | 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ‘పెగాసస్’ స్పైవేర్ కూడా పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా, ఎన్నికలకు ఏడాది ముందే విపక్ష నాయకుల ఫోన్లలోకి ఈ స్పైవేర్ను చొప్పించారన్నది నివేదికల సారాంశం. ఇప్పుడు, మళ్లీ అదే సీన్ రిపీట్ కానున్నదా? 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ‘పెగాసస్’ స్థానంలో మరో శక్తిమంతమైన కొత్త స్పైవేర్ను అధికార బీజేపీ కొనుగోలు చేయాలనుకొంటున్నదా? ఆ స్పైవేర్ సాయంతో ప్రతిపక్ష నేతలు, అసమ్మతి వర్గాలు, ప్రభుత్వ విధానాల్లో తప్పులను ఎత్తిచూపే మేధావులపై గట్టి నిఘాను కొనసాగించాలనుకొంటున్నదా? బ్రిటిష్ పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ప్రచురించిన తాజా కథనం ఇవే అనుమానాలకు తావిస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల కిందట యావత్తు దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్’ దుమారాన్ని మరిచిపోకముందే, మరో వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కొత్త స్పైవేర్ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ‘పెగాసస్’ స్పైవేర్ను తయారు చేసిన ఇజ్రాయెల్లోని ఎన్ఎస్వో గ్రూప్నకు పోటీగా ఉన్న స్పైవేర్ సంస్థల నుంచి ఈ స్పైవేర్ను కొనాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. దీని కోసం ఇప్పటికే బిడ్లను సిద్ధం చేసిన సర్కారు.. స్పైవేర్ కోసం రూ.986 కోట్లను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నది.
పెగాసస్ను తయారుచేసిన ఎన్ఎస్వో గ్రూప్నకు స్పైవేర్ రంగంలో దీటైన పోటీనిస్తూ, బయటి ప్రపంచానికి తక్కువగా పరిచయం ఉన్న సంస్థల (లో ప్రొఫైల్ కంపెనీలు) నుంచి కొత్త స్పైవేర్ను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని చెప్పినట్టు పేర్కొంది. స్పైవేర్ కోసం త్వరలోనే బిడ్డింగ్ ప్రక్రియ మొదలుకానున్నట్టు తెలిపింది.
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని గతంలోనే ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పెగాసస్ను రూపొందించిన ఎన్ఎస్వో గ్రూప్ స్పైవేర్ కార్యకలాపాలపై అప్పటికే బయటి ప్రపంచానికి అవగాహన ఉండటం, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారంటూ మానవ హక్కుల సంఘాలు కేంద్రంపై దుమ్మెత్తిపోయడం, యాపిల్, వాట్సాప్ వంటి టెక్నాలజీ సంస్థలు కూడా ‘పెగాసస్’ గురించి హెచ్చరికలు చేయడం, ఫోరెన్సిక్ పరిశోధనల్లో సులభంగా పెగాసస్ ఉనికి గుర్తించడం వెరసి ఈ అంశాలన్నీ అధికార బీజేపీని ఇరకాటంలో పెట్టాయి. దీంతో పెగాసస్ కొనుగోలు, వాడకంపై సూటిగా సమాధానం చెప్పలేకపోయిన కేంద్రం దాటవేత ధోరణి ప్రదర్శించింది. గత అనుభవాలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే, ఈసారి ఫోరెన్సిక్ పరిశోధనలకు కూడా పట్టుబడని శక్తిమంతమైన స్పైవేర్ను కొనుగోలు చేయడానికి సర్కారు యోచిస్తున్నట్టు పత్రిక వెల్లడించింది. అలాగే, వివాదాలకు దూరంగా ఉండేందుకు.. బయటి ప్రపంచానికి తక్కువగా పరిచయం ఉన్న సంస్థల నుంచి ఈ స్పైవేర్ను కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. దీనిపై రక్షణశాఖను సంప్రదిస్తే ఎవరూ స్పందించలేదని పత్రిక వెల్లడించింది. కాగా, రానున్న లోక్సభ ఎన్నికల్లో విపక్షాలను దెబ్బతీయడానికి, ప్రతిపక్ష నేతల ఫోన్లపై నిఘా పెట్టడానికే కేంద్రం కొత్త స్పైవేర్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులు, న్యాయకోవిదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఇలా దేశంలోని 300 మందికి పైగా ఫోన్లు హ్యాకింగ్కి గురయ్యాయని 2021లో ‘ఫర్బిడెన్ స్టోరీస్’ ఓ నివేదిక బయటపెట్టింది. 2018-19 మధ్య ఆయా ప్రముఖుల ఫోన్లపై నిఘా కొనసాగిందని, 2019 లోక్సభ ఎన్నికలపై ‘పెగాసస్’ ప్రభావాన్ని కొట్టిపారేయలేమని తెలిపింది. దీంతో ఏడాదిన్నరపాటు ఈ అంశంపై దేశం అట్టుడికింది. పెగాసస్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసింది. గత ఆగస్టులో నివేదికను ఇచ్చిన కమిటీ.. కొందరి ఫోన్లలో మాల్వేర్ను గుర్తించామని, అయితే అది పెగాసస్ అవునా? కాదా? అనేది తేలాల్సి ఉన్నదని చెప్పింది.
పేరు: ప్రిడేటర్ స్పైవేర్
తయారీ కంపెనీ: ఇంటెలెక్సా, గ్రీస్
విశేషాలు: వాట్సాప్లోని ఎన్క్రిప్టెడ్ మెసేజీలను చదువగలదు. ఐఫోన్లను సులభంగా ఆధీనంలోకి తీసుకోగలదు. ఫోరెన్సిక్ పరిశోధనల్లో గుర్తించడం కష్టం.
వివాదం: ప్రిడేటర్ సాయంతో గ్రీస్లోని విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారంటూ అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది ఇది ఆ దేశంలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. మానవ హక్కుల సూచీలో అట్టడుగున ఉన్న ఈజిప్ట్, సౌదీ అరేబియా, మడగాస్కర్, ఓమన్ తదితర దేశాల్లో ఈ స్పైవేర్ను విరివిగా వినియోగిస్తున్నారు.
పేరు: జీరో-క్లిక్ ఆధారిత స్పైవేర్
తయారీ కంపెనీ: క్వాడ్రీమ్,
ఇజ్రాయెల్
విశేషాలు: ఈ స్పైవేర్ నుంచి వచ్చిన మెసేజీని క్లిక్ చేయనప్పటికీ, రెండు సెకండ్లపాటు ఫోన్ స్క్రీన్పై ఆ మెసేజీ అలాగే ఉంచితే, ఫోన్లోకి స్పైవేర్ చొరబడుతుంది.
వివాదం: ఈ స్పైవేర్ను దుర్వినియోగం చేస్తున్నట్టు తయారీ కంపెనీకి ఇజ్రాయెల్ ప్రభుత్వమే నోటీసులిచ్చింది. ఇండోనేషియాలోని ప్రముఖ నేతల ఫోన్లపై ఈ స్పైవేర్తో నిఘా పెట్టారు.
పేరు: కాగ్నైట్ స్పైవేర్
తయారీ కంపెనీ: కాగ్నైట్,
ఇజ్రాయెల్
విశేషాలు: ఫోన్లోని డాటాను తన సర్వర్లలో స్టోర్ చేసుకొని, మనకు తెలియకుండానే మన ఫోన్ నుంచి డాటాను డిలీట్ చేస్తుంది. మాల్వేర్ ప్రవేశించినట్టు కూడా తెలియదు.
వివాదం: ఈ స్పైవేర్ పెద్దమొత్తంలో దుర్వినియోగం అవుతున్నట్టు మెటా ఓ రిపోర్ట్లో పేర్కొంది. దీంతో నార్వేకు చెందిన వెల్త్ ఫండ్ దీని వాడకాన్ని నిలిపేసింది. అయితే, బంగ్లాదేశ్, మయన్మార్ కాగ్నైట్ కంపెనీతో ఒప్పందాలు చేసుకొన్నాయి. దీనిపై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి.