BJP | తమను మించిన భక్తాగ్రేసరులు లేనే లేరని గప్పాలు కొట్టే బీజేపీ.. దేవుడిపై పన్నులు వేస్తున్నది. అయోధ్య ఆలయాన్ని అత్యద్భుతంగా కడుతామని నమ్మబలికిన యోగి సర్కార్.. ఇప్పుడు అదే పుణ్యభూమిలోని చిన్న చిన్న గుడులపై ట్యాక్స్ విధిస్తున్నది. 2022 ఎన్నికల్లో ఆలయాలపై పన్నులు తగ్గిస్తామని చెప్పిన యోగి ప్రభుత్వం.. మాట నిలబెట్టుకున్నట్టే నటించి, ఏడాది తర్వాత ‘సింబాలిక్ ట్యాక్స్’ పేరిట కొత్త పన్ను భారాన్ని మోపింది. దేవుడికి బీజేపీ దోఖాపై అయోధ్య పూజారులు, మఠాధిపతులు మండిపడుతున్నారు.
అయోధ్యలో రాములోరికి అత్యద్భుతంగా భవ్య మందిరాన్ని నిర్మిస్తున్నామంటూ గప్పాలకు పోతున్న బీజేపీ సర్కారు.. అక్కడి దేవుళ్లపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నది. ఎన్నికల్లో లబ్ధికి దేవుడిని ఓ పావుగా వాడుకొని.. ఇప్పుడు పన్నుల పేరిట చిన్న ఆలయాల పూజారులను, మఠాధిపతులను పీల్చి పిప్పి చేస్తున్నది.
చిన్న ఆలయాలు, మఠాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. పెద్ద ఆలయాలు, మఠాలకు ట్యాక్స్ను మినహాయిస్తున్నారు. ఇది అన్యాయం.
– మహంత్ ధర్మదాస్, నిర్వాణి అనీ అఖారా మఠాధిపతి
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘శ్రీరాముడు నడయాడిన పుణ్య భూమిగా పిలిచే అయోధ్యలో ఉన్న అన్ని ఆలయాలు, మఠాలకు పన్నులు రద్దు చేస్తున్నాం’ అంటూ 2022లో ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే.. భూమి శిస్తు, తాగునీరు, మురుగునీరు, పారిశుద్ధ్యం తదితర పన్నుల జాబితా నుంచి ఆలయాలు, మఠాలకు మినహాయింపునిచ్చింది. దీంతో పూజారులు, మఠాధిపతులు ఎంతగానో సంతోషించారు. అయితే, ఈ ఆనందం ఎంతోకాలం నిలువలేదు. పన్ను మినహాయింపుపై ఇచ్చిన హామీని ఏడాది పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ‘సింబాలిక్ ట్యాక్స్’ పేరిట కొత్త వసూళ్లకు తెర తీసింది. దీనిపై పూజారులు, మఠాధిపతులు మండిపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పరిధిలో మొత్తం 8 వేల వరకు ఆలయాలు, మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. వీటికి అన్ని రకాల పన్నులను రద్దు చేస్తే తమ ఆదాయానికి రూ.3 కోట్ల మేర గండి పడుతుందని అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. దీంతో ఎన్నికలయ్యే వరకూ బీజేపీ ప్రభుత్వం నోరు మెదపలేదు. ఎన్నికల తర్వాత మళ్లీ తమ పార్టీ పగ్గాలు చేపట్టగానే, ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకొంది. ‘సింబాలిక్ ట్యాక్స్’ పేరిట కొత్త వసూళ్లకు గత ఏడాది సెప్టెంబర్లో ప్రణాళికలు సిద్ధం చేసింది. వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న గుడి, మఠానికి ఏడాదికి రూ. వెయ్యి, 1,000-3,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల వాటికి రూ.3 వేలు, 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ వైశాల్యంలో ఉన్న గుళ్లు, మఠాలకు రూ.5 వేల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. గత ఏప్రిల్ 1 నుంచి వాత మొదలు పెట్టింది.
ఇచ్చిన హామీని పక్కనబెట్టి దేవుడి గుళ్లపై ట్యాక్స్ వసూలు చేస్తున్న యోగీ సర్కారుపై పలువురు పూజారులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం దేవుడి పేరును వాడుకోవడమేంటని ధ్వజమెత్తుతున్నారు. అయోధ్యలో ఉన్న మొత్తం 8 వేల ఆలయాలు, మఠాలలో 300-400 వరకు మాత్రమే అత్యంత పెద్ద ఆలయాలని, మిగతావి వెయ్యి చదరపు అడుగుల లోపువేనని గుర్తు చేశారు. అన్ని ఆలయాలకు ఒకే విధంగా పన్ను వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ట్రస్టీలుగా ఉన్న పెద్ద ఆలయాలు, మఠాలకు లబ్ధి చేకూర్చడానికి ఈ స్లాబ్ సిస్టమ్ పెట్టారని, పలుకుబడి ఉన్న మఠాల నుంచి అసలు పన్నులు వసూలు చేయట్లేదని ఆరోపిస్తున్నారు. చిన్న గుళ్లకు అసలు ఆదాయం ఉండదని, అలాంటి వాటిని ఆదుకోవాల్సింది పోయి.. ఎడాపెడా పన్నులను విధించడమేంటని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దేవుడిపై బీజేపీ సర్కారుకు ఉన్న భక్తి ఇదేనా? అంటూ నిలదీస్తున్నారు.
దశాబ్దాల న్యాయ వివాదానికి తెర దించుతూ అయోధ్యలో కొత్త రామాలయం కట్టేందుకు సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న అనుమతించిన వెంటనే దళితులు, పేదల భూములను యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, వారికి సన్నిహితులైన అధికారులు తక్కువ ధరలకే సొంతం చేసుకొన్నారు. ఈ మేరకు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ ఆంగ్ల దినపత్రిక గతంలో ఆధారాలతో సహా బయట పెట్టింది. కొందరు సొంతంగానే దర్జాగా భూములు కొనగా, మరికొందరు బినామీల పేర్లపై కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. రామాలయం పునర్నిర్మాణం తర్వాత భూముల ధరలకు రెక్కలొస్తాయని ముందుగానే అంచనా వేసి అధికార పార్టీ ఈ భూదందాకు తెరలేపిందన్న ఆ పత్రిక.. ఈ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని సాక్ష్యాలతో సహా వివరించింది.