బెంగళూరు: తాను కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తున్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేశానని జేడీ(ఎస్) ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే ఖాళీ బ్యాలెట్ పేపర్ను సమర్పించినట్లుగా వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. క్రాస్ ఓటింగ్కు భయపడిన జేడీ(ఎస్) తన పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్లో ఉంచింది. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నదని జేడీ(ఎస్) చీఫ్, మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.
మరోవైపు శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కొందరు జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా క్రాస్ ఓటు వేశారు. ఆ పార్టీకి చెందిన కోలారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఓటింగ్ తర్వాత మీడియాకు ఈ విషయాన్ని చెప్పారు. తాను కాంగ్రెస్కు ఓటు వేశానన్న ఆయన, ఆ పార్టీ అంటే తనకు ఇష్టమన్నారు. జేడీ(ఎస్)ను వీడి కాంగ్రెస్లో చేరుతానని గతంలో కూడా ఆయన వెల్లడించారు.
మరో జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్డీ రవన్న, ఓటు వేసే ముందు తన బ్యాలెట్ పేపర్ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చూపారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటు వేసిన పార్టీ ఎమ్మెల్యేలపై జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి మండిపడ్డారు. బాధ్యత ఉన్నవారు పార్టీకి రాజీనామా చేసి ఇలాంటి రాజకీయాలు చేయాలని విమర్శించారు.