ప్రశ్నించావా.. నీపై కత్తిగడతా..!
విమర్శించావా.. నీ సంగతి తేలుస్తా..!
ప్రతిపక్షమైనా, ప్రజాస్వామికవాదులైనా, పత్రికలైనా.. ప్రపంచస్థాయి సంస్థలైనా మోదీ ప్రభుత్వ తీరిదే! ‘ఇటీవల గోద్రా సంఘటనపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. అదే నేరమైనట్టు ఆ చానల్ను నిషేధించాలని కోరుతూ బీజేపీకి చెందిన అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇంత అహంకారమా? ఇంత అసహనమా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా ఇది? ఇట్ల ఉన్మాదంగా వ్యవహరిస్తే.. మనదేశం గురించి ప్రపంచం ఏమనుకుంటుంది?’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేసి మూడు రోజులైనా గడవలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కక్షసాధింపు ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నది. గోద్రా డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ సంస్థపై దాదాగిరీకి దిగింది. ఐటీ బృందాలతో దాడులు చేయించి, భీతావహ వాతావరణాన్ని సృష్టించింది.
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ- స్పెషల్ టాస్క్ బ్యూరో): 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై ఇటీవలే డాక్యుమెంటరీ ప్రసారం చేసిన అంతర్జాతీయ దిగ్గజ వార్తా సంస్థ ‘బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ)లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. 60 నుంచి 70 మంది సిబ్బందితో కూడిన అధికారుల బృందం ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం తనిఖీలు చేపట్టింది. ఆయా కార్యాలయాల్లోకి ఎవరినీ రాకుండా.. బయటకు వెళ్లకుండా నిలిపివేసింది. ఉద్యోగుల ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ స్వాధీనం చేసుకున్న బృందం.. కొందరిని ఇంటికి పంపించివేసింది.
షిఫ్ట్లో ఉన్నవారిని ఒక గదిలో ఉంచినట్టు వార్తలు వచ్చాయి. రాత్రి పొద్దు పోయేంతవరకు సోదాలు కొనసాగాయి. బీబీసీ ఇండియా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. అయితే, ఇవి సోదాలు కావని, పన్ను అవకతవకలు, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, సబ్సిడరీల ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సర్వే మాత్రమే అని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ నేపథ్యంలో బీబీసీపై ఐటీ దాడులు నిర్వహించడం రాజకీయ దుమారం రేపింది. బీజేపీ సర్కారుపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని ధ్వజమెత్తాయి.
ఐటీ శాఖ అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని బీబీసీ తెలిపింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఏమిటన్నదానిపై విశ్లేషిస్తూ గత నెల బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ, అనేక విశ్వవిద్యాయాల్లో ప్రదర్శించారు. ఢిల్లీలోని జేఎన్యూ, రాజస్థాన్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రదర్శనలను అడ్డుకోవడం పెద్ద దుమారాన్నే రేపింది. దేశంలో బీబీసీని బ్యాన్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టేసింది. కాగా, బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నది.
ఈడీ తరువాతి రైడ్స్ హిండెన్బర్గ్ పైనేనా?
ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఆ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఐటీ, ఈడీ, సీబీఐ.. బీజేపీ ఆడించే తోలుబొమ్మలుగా మారడం హాస్యాస్పదంగా ఉన్నది. తర్వాతేంటి? హిండెన్బర్గ్ సంస్థపై ఈడీ దాడులు చేస్తుందా? లేక దానిని ప్రత్యర్థి సంస్థ కొనేస్తుందా?
– ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
ఐటీ శాఖకు పూర్తిగా సహకరిస్తున్నాం: బీబీసీ
తమ సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ జరుపుతున్న సర్వేకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్టు బీబీసీ సంస్థ ప్రకటించింది. అతి త్వరలోనే ఈ పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. బీబీసీ సంస్థపై ఐటీ దాడుల మీద బ్రిటన్ ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. ఆ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నదని వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే వేధిస్తారా: ఎడిటర్స్ గిల్డ్
బీబీసీ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడుల మీద ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. విమర్శించే మీడియా సంస్థలను బెదిరించేందుకు, వేధించేందుకు ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకునే ధోరణికి ఇది కొనసాగింపు అని పేర్కొన్నది. జర్నలిస్టులు, మీడియా సంస్థల హక్కులను అణగదొక్కవద్దని ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసినందువల్లే ఆ సంస్థపై ఐటీ సర్వే జరుగుతున్నదని పేర్కొన్నది. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ధోరణి అని విమర్శించింది.
అధికార దుర్వినియోగం: పీసీఐ
బీబీసీ కార్యాలయాలపై ఐటీ సోదాలను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఖండించింది. ప్రభుత్వం తనకు వ్యతిరేకమని భావించే మీడియా సంస్థలపై జరుగుతున్న దర్యాప్తు సంస్థల దాడులకు కొనసాగింపుగా ఈ దాడి జరిగిందని పేర్కొంది. మీడియాను భయపెడుతున్న దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాలని కోరింది.
ప్రజలే గుణపాఠం చెప్తారు
కేంద్రం ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను నాశనం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీ, సీబీఐ, ఐటీని రాజకీయ అస్ర్తాలుగా వాడుకున్నారు. బీబీసీపై ఐటీ సర్వే కూడా ఇలాంటిదే.
-స్టాలిన్,తమిళనాడు సీఎం