భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉంచారు. ఈ ముగ్గురికి సంబంధించిన కేసుల్లో 18 వేల కోట్ల రూపాయలు రికవరీ జరిగిందని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న మెహతా తెలిపారు.
బుధవారం నాడు మెహతా ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపారు. అలాగే ఆర్థిక నేరగాళ్లయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసుల విలువ ప్రస్తుతం రూ.67 వేల కోట్లని వెల్లడించారు. అంటే ఇంకా 49 వేల కోట్ల రూపాయల రికవరీ జరగాల్సి ఉందన్నమాట. ఈ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ ముగ్గురు నిందితులకు సంబంధించిన పలు ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే.
ఈ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 18 వేల కోట్లకు పైగానే ఉంటుందని మెహతా వివరించారు. గత డిసెంబరులో ఇదే విషయంపై మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మాల్యా, మోదీ, ఛోక్సీలకు సంబంధించిన ఆస్తులు అమ్మకం ద్వారా బ్యాంకుల నష్టాల్లో రూ.13,109 కోట్ల రికవరీ జరిగిందని తెలిపారు. ప్రస్తుతం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఇద్దరూ ఇంగ్లండ్లో ఉన్న సంగతి తెలిసిందే.
కోర్టు ఉల్లంఘన కేసులో తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు గురువారం నాడు సుప్రీంకోర్టు ముందు అతను హాజరు కావలసి ఉంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు చెందిన 9 వేల కోట్ల కుంభకోణం కేసులో ఇదే అతనికి లాస్ట్ ఛాన్స్. ఇటీవల డొమినికా దేశం నుంచి బెయిలు పొందిన మెహుల్ ఛోక్సీ.. ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో రూ.13,500 కోట్ల కుంభకోణం కేసులో అతను నిందితుడు. ఛోక్సీ మేనల్లుడైన నీరవ్ మోదీ కూడా పీఎన్బీని మోసం చేసి పరారయ్యాడు. అతను కూడా ప్రస్తుతం లండన్లోనే ఉన్నట్లు సమాచారం.