లక్నో: అప్పు తీర్చాలని కోరిన బ్యాంకు సిబ్బందిని రుణ ఎగవేతదారుడు, అతడి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు నిర్బంధించారు. (Bank employee taken hostage) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రథమ గ్రామీణ బ్యాంకు బల్పూర్ శాఖ సిబ్బంది సోమవారం సోన్హారా గ్రామానికి వెళ్లారు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ గ్రహీత ఘనశ్యామ్ ఇంటికి వెళ్లి బకాయిలు తీర్చాలని కోరారు.
కాగా, ఘనశ్యామ్, అతడి కుటుంబ సభ్యులు బ్యాంకు సిబ్బందిని తిట్టడంతోపాటు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగక వారిని నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు సిబ్బందిని కొట్టి నిర్బంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బ్యాంకు సిబ్బందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.