న్యూఢిల్లీ: రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ అసలుకే ఎసరు తెస్తున్నది. ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వరంగ సంస్థల్లోనూ భర్తీలకు మంగళం పాడింది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలైన నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్లో గత నాలుగైదు ఏండ్లలో కనీసం ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. రాజ్యసభలో మంగళవారం ఏఏ రహీం వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్ కరాడ్ ఈ సంగతి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయమున్న ఓరియంటల్ ఐదేండ్లుగా, కోల్కతా కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్సూరెన్స్ నాలుగేండ్లుగా ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని వివరించారు.
ఇక అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ 2021-22లో ఒకరిని, 2017-18లో 45 మందిని రిక్రూట్ చేసుకొన్నది. ఈ మధ్యకాలంలో భర్తీలను పూర్తిగా నిలిపివేశారు. ఈ కంపెనీల విలీన ప్రతిపాదన దృష్ట్యా.. ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నందునే భర్తీలు చేపట్టడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. సీబీఐలో 1600కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి సీబీఐలో 7,295 మంజూరైన పోస్టులు ఉన్నాయని, వాటిలో వివిధ క్యాటగిరీలకు చెందిన 128 అదనపు పోస్టులు సహా 1,673 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
భారీగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఖాళీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,472 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారుల పోస్టులతోపాటు 864 ఐపీఎస్ పోస్టులు, 1,057 ఐఎఫ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జితేంద్ర సింగ్ వెల్లడించారు.