రాజ్కోట్: ఎన్నికలంటేనే రాజకీయ పార్టీల ప్రచార హోరు. అభ్యర్థుల ప్రచార జోరు. ప్రత్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలు. కార్యకర్తల హంగామా. అయితే ఇవన్నీ ఆ ఊర్లో కనబడవు. ఎన్నికల సందర్భంగా ఆ గ్రామంలో రాజకీయ పార్టీల ప్రచారంపై నిషేధం విధించారు. అలాగని వారు ఎన్నికలకు వ్యతిరేకమేమీ కాదు.. ఊర్లో ఓటు హక్కున్నవారంతా తప్పనిసరిగా ఓటెయ్యాల్సిందే. లేదంటే జరిమానా కట్టాల్సిందే. దాదాపు 40 ఏండ్ల నుంచి ఈ నిబంధనలను తూ.చా. తప్పకుండా అమలుస్తున్నది గుజరాత్లోని రాజ్సమధియాల (Raj Samadhiyala) గ్రామం.
రాజ్కోట్ జిల్లాలోని రాజ్ సమధియాల గ్రామంలో ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారంపై నిషేధం విధించారు. 1983 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఆ గ్రామానికి చెందినవారు ఎవరైనా ఓటు వేయకపోతే రూ.51 జరిమానా చెల్లించాల్సిందేనని సర్పంచ్ తెలిపారు.
తమ ఊర్లో ఏ ఇంటికి తాళాలు కనిపించవని, ప్రజలెవరూ తాళాలు వేయరని చెప్పారు. అదేవిధంగా దుఖానదారులు మధ్యాహ్నం భోజనానికి వెళ్లినప్పుడు.. షాపు మూసి వెళ్లరని తెలిపారు. ఆ సమయంలో ఎవరైనా వినియోగదారుడు దుకాణానికి వచ్చినా.. తమకు అవసరమైన వస్తువులను తీసుకెళ్తారని, వాటికి అయ్యే మొత్తాన్ని షాపు గుమ్మం వద్ద పెట్టి వెళ్తారన్నారు. ఇప్పటివరకు తమ గ్రామంలో ఒక్క సారిమాత్రమే దొంగతనం జరిగిందని, అదికూడా మరిసటి రోజే ఆ దొంగ గ్రామాపంచాయతీ ముందు లొంగిపోయాడని ఆయన చెప్పారు.
వీటితోపాటు పౌరులకు గ్రామపంచాయతి నిబంధనలు అమలుచేస్తున్నది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ప్లాస్టిక్ పడేసినా, గుట్కా తిన్నా రూ.51 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మద్యం సేవించినా, చెట్లను నరికినా, కొట్టివేసినా, పోలీసుకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టులో కేసు వేసినా, లోక్ అదాలత్కు హాజరైనా, మూఢనమ్మకాలను ప్రోత్సహించడం, పటాకులు కాల్చినా రూ.500 చెల్సించాలి. ఇక తప్పుడు సాక్ష్యం, గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించకపోవడం, భూములను ఆక్రమించడం, బహిరంగంగా ఎవరినైనా దూషించినా రూ.251 జరిమానా విధిస్తారు. ఈ మేరకు గ్రామం నడిబొడ్డున గ్రామంలో ఏమి చేయకూడదు, ఏం చేస్తే ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.