న్యూఢిల్లీ: బలూచిస్థాన్లో పెరిగిపోతున్న హింస పాకిస్థాన్లోని తాజా పరిస్థితిని ప్రతిబింబిస్తూ భద్రతా సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) తన ఆపరేషన్ హెరోఫ్ ద్వారా సైన్యంపై దాడులు తీవ్రతరం చేస్తూ పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది. ప్రధాన పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు బీఎల్ఏ తన ఆపరేషన్ హెరోఫ్ 2.0 దశలో భాగంగా ఆత్మాహుతి దాడులు, కాల్పుల పోరుతో బీభత్సం సృష్టిస్తున్నది.
డజన్ల సంఖ్యలో పౌరులు, భద్రతా సిబ్బంది మరణించారని, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తీవ్రవాదుల అణచివేత ఆపరేషన్ జరుగుతున్నదని పాకిస్థానీ అధికారులు చెబుతున్నారు. గడచిన 48 గంటల్లో 177 మంది తీవ్రవాదులను మట్టుపెట్టినట్లు వారు తెలిపారు. అయితే బీఎల్ఏ ఈ వాదనను తోసిపుచ్చింది. తాము జరిపిన దాడుల్లో సుమారు 200 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలిపింది.
బలూచిస్థాన్ తిరుగుబాటు పాక్ ప్రభుత్వానికి భద్రతాపరంగా, ఆర్థికంగా, విదేశాంగ విధానం పరంగా తలనొప్పిగా మారింది. గ్వదర్ పోర్టు ద్వారా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని ఆశిస్తున్న చైనాకు బలూచిస్థాన్ ప్రావిన్సు ప్రతిబంధకంగా మారింది. రేకో డిఖ్ వద్ద అపార ఖనిజ నిక్షేపాలు ఉన్న బలూచ్, ఇరాన్, అప్ఘానిస్థాన్కు సరిహద్దున ఉండడంతో భద్రతాపరంగా పాక్కు కీలకంగా మారింది. బలూచ్లో తాజాగా జరిగిన మహిళా ఆత్మాహుతి బాంబర్ల దాడులు పాకిస్థాన్కు చెందిన విలువైన ఖనిజ నిక్షేపాల్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిగా ఉన్న వారందరికీ హెచ్చరిక లాంటిదని రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మాన్ వ్యాఖ్యానించారు.
ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం హింస ప్రజ్వరిల్లిందని, స్థానిక వనరులను వెలుపలి శక్తులు దోచుకుంటున్నాయనే కోపమే బలూచ్ పౌరుల తిరుగుబాటుకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. మొట్టమొదటిసారి పురుషులతోపాటు మహిళలు కూడా బీఎల్ఏ పోరాటంలో భాగస్వాములయ్యారు. 800 నుంచి 1,000 మంది మహిళలు ఈ పోరాటంలో ఉండవచ్చని, వారికి నెలల తరబడి శిక్షణ ఇచ్చి ఉంటారని ఓ నిఘా అధికారి తెలిపారు. పాకిస్థాన్ ఈ తిరుగుబాటును కేవలం భద్రతాపరంగా మాత్రమే చూడడం లేదు. బీజింగ్తో సంబంధాలు, పెట్టుబడిదారుల విశ్వాసం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని బలూచ్ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని భావిస్తున్నది.