Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు నిహార్ ఠాక్రే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరాడు. త్వరలో అంధేరి ఈస్ట్ ఉప ఎన్నికల్లో బాబాయ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నాడు. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపాడు.
అంధేరీ తూర్పు అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో షిండే క్యాంప్ మద్దతుతో బీజేపీ ముర్జీ పటేల్ను ఎన్నికల బరిలో నిలిపింది. మరో వైపు ఉద్ధవ్ వర్గం రితుజా లాట్కేను పోటీలో దింపింది. శివసేన పార్టీ రెండువర్గాలు చీలిన అనంతరం తొలిసారిగా ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఇరువర్గాలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి తమ ఉనికిని చాటుకోవాలని ఇరువర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నిహార్ వృత్తిరీత్యా న్యాయవాది. శివసేనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఏక్నాథ్ షిండే వర్గంతో పోరాడుతున్న లీగల్ టీమ్లో నిహార్ ఠాక్రే సైతం ఉన్నాడు. తన తాత, దివంగత బాల్ఠాక్రే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని, అందుకే షిండేకు మద్దతు ఇచ్చినట్లు నిహార్ పేర్కొన్నాడు.
బాల్ థాకరే కుమారుడైన బిందుమాధవ్ ఠాక్రే కొడుకే ఈ నిహార్ థాకరే. బింధు ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రేకి అన్న. బింధుమాధవ్ ఠాక్రే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకు ముందు దసరా ర్యాలీ సందర్భంగా నిహార్ థాకరే ఏక్నాథ్ షిండేతో వేదికను పంచుకున్నారు. గతంలో ఉద్ధవ్ అన్న జయదేవ్ మాజీ భార్య స్మిత సైతం షిండేతో కలిసి ఒకే వేదికపై కనిపించారు. నిహార్ ఠాక్రే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి హర్షవర్థన్ పాటిట్ కుమార్తె అంకితా పాటిల్ను పెళ్లి చేసుకున్నారు.