న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ( Adhir Ranjan Chowdhury ) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మెజారిటీ వర్గం బాహుబలి ఎత్తుగడలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. గత సెషన్లో తప్పిదాలకు ఈ సెషన్లో శిక్షలు విధించడం విచిత్రంగా ఉన్నదని పేర్కొన్నారు.
పార్లమెంట్ గత సెషన్లో సభ్యుల ద్వారా జరిగిన పొరపాట్లకు ఈ సెషన్లో శిక్షలు విధించడం ఎప్పుడైనా చూశామా..? ఇక్కడ ప్రతీకార చర్య కొనసాగుతున్నది. సభలో మమ్మల్ని బుల్డోజ్ చేయడం, భయపెట్టడం, మా తరఫున వాదనలు వినిపించకుండా మా అవకాశాలను లాక్కోవడం అనేది మోదీ ప్రభుత్వ కొత్త వ్యూహం. పార్లమెంటులో ఇలాంటి ప్రతీకార ధోరణిని తాము మునుపెన్నడూ చూడలేదు అని అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు.