కేదార్నాథ్, జూన్ 18: కేదార్నాథ్ ఆలయానికి బంగారు తాపడం చేసే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి కుంభకోణం విలువ రూ.125 కోట్ల వరకు ఉంటుందని, ఆ ఆలయానికి చెందిన సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో, వాటిని బద్రీ-కేదార్నాథ్ ఆలయ కమిటీ(బీకేటీసీ) ఆదివారం ఖండించింది.
ఆలయ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఇలాంటి కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బంగారు తాపడం ప్రక్రియను పురావస్తు శాఖ నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఈ పనుల్లో ఆలయ కమిటీ జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.