డెహ్రాడూన్ : కేదార్నాథ్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురుస్తుండడంతో చలితీవత్ర పెరుగుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీగా తేడాలుంటున్నాయి. రాంబాడ నుంచి రుద్రపాయింట్ వరకు నాలుగు కిలోమీటర్ల కాలినడక మార్గంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మార్గం ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 28 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 27 మందికి గుండెపోటు వచ్చింది. సముద్రమట్టానికి 11750 అడుగులో ఉన్న కేదార్నాథ్ మూడు వైపులా భారీ మంచుకొండలున్నాయి.
గౌరీకుండ్ వైపు లోయ ఉంటుంది. ప్రస్తుతం కేదార్నాథ్లో వాతావరణ పరిస్థితులు భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మే 6న యాత్ర మొదలైన నాటి నుంచి వాతావరణ పరిస్థితులు దిగజారుతూ వస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 20-24 గంటల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారిగా 2నుంచి3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరగా.. వర్షంలో తడిసిముద్దవుతున్నారు. పొగమంచు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, కళ్లు తిరగడం సమస్యలతో బాధపడుతున్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు. ఇవే సమస్యలు పలువురు ప్రాణాలు కోల్పోయారు.
గౌరీకుండ్ – కేదార్నాథ్ మార్గంలో రాంబాడ నుంచి రుద్రపాయింట్ మధ్య నాలుగు కిలోమీటర్ల ప్రయాణం ఇబ్బందులకు గురి చేస్తున్నది. మందాకిని నదికి ఇరువైపులా ఎత్తైన పర్వతాలు ఉండడంతో ఈ ప్రాంతం పూర్తిగా ‘వీ’ ఆకారంలో లోయ ఉంటుంది. దీంతో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీంతో ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. పలు సమయాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. ఈ క్రమంలో సోన్ ప్రయాగ్లో 50 ఏళ్లు పైబడిన వ్యక్తులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో ఫిట్ కానీ పక్షంలో సదరు వ్యక్తి సొంత పూచీకత్తుపై మాత్రమే అనుమతిస్తున్నారు.